జగన్పై తిరుగుబాటుకు ఇన్వెస్టర్లు సిద్ధం? త్వరలో నోటీసులు!
తమ పెట్టుబడులు తమకు వెనక్కి ఇప్పించాలని కోరనున్నారని, తప్పుడు అంచనాలు ఇచ్చిన డెలాయిట్కు, ఇప్పించిన జగన్కు కూడా నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారట. వచ్చే వారంలోనే ఈ నోటీసులు పంపించే అవకాశముంది. జగతి పబ్లికేషన్స్లో జగన్ పెట్టుబడి చాలా తక్కువున్నప్పటికీ ఆయన వాటా డెబ్బై శాతం కాగా, ఇతర ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెద్దమొత్తంలో ఉన్నప్పటికీ వారందరి వాటా కేవలం ముప్పై శాతం మాత్రమే ఉందని, రూ.30 విలువ చేసే షేరును రూ.350 పెట్టి కొనడమే దీనికి కారణమని పేర్కొంది. ఇంత భారీ ప్రీమియంతో వాటాలు కొనడానికి డెలాయిట్ ఇచ్చిన అంచనాలే కారణమని పైకి చెబుతున్నప్పటికీ వైఎస్ హయాంలో పొందిన మేళ్లకు ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టినట్లు (క్విడ్ ప్రొ కొ) ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే సిబిఐ దర్యాప్తు జరుగుతోంది.
ఈ దర్యాప్తుతో ఆ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి పెట్టుబడుల మూలాలు శోధిస్తోంది. ఒకవేళ జగన్ కంపెనీల ఖాతాలను స్తంభింపచేసి, ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితే వస్తే, ఇన్వెస్టర్లు తమ సొమ్ముకు నీళ్లొదులు కోవాల్సిందే! ఇన్ని కష్టాల్లో కూరుకుపోయిన జగన్ ఇన్వెస్టర్లకు 'డెలాయిట్' సుదర్శన్ వాంగ్మూలం బ్రహ్మాస్త్రంలా దొరికిందని పేర్కొంది. డెలాయిట్ ఆకర్షణీయమైన అంచనాలతో ఇచ్చిన వాల్యుయేషన్ నివేదికను చూపించి తమ నుంచి భారీ ప్రీమియం వసూలు చేశారని, తమను వంచించారని కంపెనీ లా బోర్డుకు ఫిర్యాదు చేయాలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారట. తమ సొమ్ము తాము వెనక్కి ఇప్పించాల్సిందిగా కోరనున్నారు. ఇన్వెస్టర్ల ఫిర్యాదు మేరకు కంపెనీ లా బోర్డు చర్యలు తీసుకుంటే జగన్కు మరిన్ని ఇక్కట్లు తప్పవు.