కెసిఆర్కు పార్లమెంటులో మాయావతి ఎంపిల తోడు?
తాను మాయావతిని కలుస్తానని, తమకు బిఎస్పి పూర్తి మద్దతు ఇస్తుందని కెసిఆర్ అంటున్నారు. బిఎస్పి కెసిఆర్కు మద్దతిస్తే లోకసభలో వేడి పుట్టే అవకాశం ఉంది. బిఎస్పి సభ్యులు యుపి విభజన అంశాన్ని ప్రధానం చేసుకుని తెలంగాణకు మద్దతు పలికే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బిజెపి వైఖరి ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. బిజెపికి తెలంగాణ అంశం కన్నా నల్లధనం, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రధానం కావచ్చునని అంటున్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని లక్ష్యం చేసుకోవాలని, పార్లమెంటులో చిదంబరం ప్రసంగాన్ని అడ్డుకోవాలని బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందువల్ల బిజెపి కోరిక మేరకు కెసిఆర్ తెలంగాణ అంశంపై కేంద్రాన్ని నిలదీయడానికి సమయం తీసుకుంటారా అనే సందేహం కూడా కలుగుతుంది.
కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఉత్కంఠను కలిగించే విషయమే. తెరాసకు దీటుగా వారు నిలబడతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. 2014 ఎన్నికల వరకు కాలయాపన చేయాలనే పార్టీ అధిష్టానం ఆలోచనకు అనుగుణంగానే కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల వ్యూహం ఉండవచ్చునని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్ పూర్తిగా నెట్టుకొస్తారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు.