జగన్కు లేని నిబంధనలు మాకా?:స్పీకర్కు టిడిపి ప్రశ్న
దీంతో వారు ఈ విషయమై స్పీకర్ మీరాకుమార్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమను సంప్రదించకుండా లోక్సభ సెక్రటరీ జనరల్ బోర్డు పీకేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న చరిత్ర తమకుందని, 20 ఏళ్లుగా తమ పార్టీ అదే గది నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆమెకు వివరించారు. ఉభయ సభల్లో 25 మంది ఎంపీలున్న డిఎంకెకు దాని సంఖ్యాబలం రీత్యా ఈ గదిని రెండేళ్ల క్రిందటే కేటాయించామని, అప్పట్నుంచీ టిడిపిని ఖాళీ చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని స్పీకర్ గుర్తు చేశారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో తమకు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నందున విశాలమైన గదిని కేటాయించాలని డీఎంకె కోరింది.
నిబంధనల ప్రకారమే వ్యవహరించామన్న స్పీకర్ సమాధానంతో టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూల్స్ తమకొక్కరికే వర్తిస్తాయా అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. అలాగైతే నిబంధనల ప్రకారం తమకు ఇవ్వాల్సిన వసతులు ఇచ్చారా అని నిలదీశారు. తమ సభ్యులు నిమ్మల కిష్టప్ప, వేణుగోపాలరెడ్డిలకు బంగ్లాలు కేటాయించాల్సి ఉన్నా, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి ఎంపిలైన వారికి నివాసంగా ఫ్లాట్లు కేటాయించాల్సి ఉండగా, జగన్తో సహా 20 మందికి బంగ్లాలు కేటాయించారని ధ్వజమెత్తారు. తమ నేత నామా నాగేశ్వరావు ఓడించిన మాజీ ఎంపి రేణుకా చౌదరిని ఇంకా అదే భవనంలో ఎందుకు కొనసాగిస్తున్నారని, నామాకు మాత్రం ఇంతవరకు బంగళా ఎందుకు కేటాయించలేదని రమేశ్ రాథోడ్ నిలదీశారు.
ఎప్పుడో పదవీ విరమణ చేసిన గిరీష్ సంఘీ వంటి వారిని ఇంకా బంగ్లాల నుంచి ఖాళీ చేయించలేదని విమర్శించారు. అన్నీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంటే తామూ పాటిస్తామన్నారు. తమ సభ్యులు ముప్పై మందికి పైగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడూ తాము అదే గదిలో కొనసాగామని, ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నప్పుడు కూడా అందులోనే ఉన్నామని అలాంటిది ఇప్పుడే తమను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఖిన్నురాలైన స్పీకర్ మీరాకుమార్ తాను డిఎంకె, తెలుగుదేశం నేతల మధ్య మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.