వారి కోసమే రచ్చబండ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
రానున్న మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగ జాతర ద్వారా అర్హత, ప్రతిభ ఉన్నవారికి సిఫార్సు అక్కర్లేకుండా ఉద్యోగాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. 27 లక్షల విద్యార్థులకు రూ. 350 కోట్లతో స్కాలర్షిప్పులు ఇస్తున్నామని, పాత బకాయిలు కూడా తీర్చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు లక్షవరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. మహిళల్లో ఆర్థిక సాధికారత పెరిగిందని,త ఇంట్లో మహిళలే ఆర్థిక మంత్రులని ఆయన అన్నారు. మహిళలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు ఇస్తారని చెబుతూ పెన్షన్ కావాలన్నా, ఆరోగ్య శ్రీ కావాలన్నా, మరి ఏ ఇతర సౌకర్యం కావాలన్నా రేషన్ కార్డులు ఉండాలని, అందుకే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నదని ఆయన వివరించారు. ప్రతి మండలంలో రూ. 25 లక్షలతో స్త్రీ శక్తి భవన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసినట్టు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు.