తెలంగాణపై తెరాసకు కాంగ్రెసు ఎమ్మెల్యేల కౌంటర్
సమావేశం తర్వాత వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాలని అనుకున్నారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో వారు రేపు శుక్రవారం ఉదయం స్పీకర్ను కలిసే అవకాశం ఉంది. తెలంగాణపై స్పీకర్ సభలో చర్చకు అనుమతిస్తే దాన్ని సాకుగా చూపి తెరాస సభ్యులను శాంతింపజేయవచ్చుననేది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, తెలంగాణపై చర్చకు స్పీకర్ అనుమతి ఇస్తారా అనేది అనుమానమే. కాగా, తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపైనే దృష్టి కేంద్రీకరించారు.
తెలంగాణపై చర్చకు అనుమతి ఇవ్వాలని తాము స్పీకర్ను కోరుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ అందించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.