జగన్కు షాక్ మీద షాక్, ముగ్గురు ఎమ్మెల్యేలు వెనక్కి
పార్టీని నియోజకవర్గాల్లో పటిష్టం చేయడంపై జగన్ దృష్టి పెట్టడం లేదని, పార్టీలో సమన్వయం లేదని, ప్రణాళిక కూడా లేదని కొంత మంది జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యుల్లో తీవ్రమైన అయోమయం చోటు చేసుకుందని చెబుతున్నారు. తమ భవిష్యత్తుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. నవంబర్ 24వ తేదీన జరిగిన జగన్ వర్గం సమావేశానికి 21 మంది శాసనసభ్యులు హాజరు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 15కు పడిపోయిందని చెబుతున్నారు.
జగన్ వర్గం శాసనసభ్యులను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి దొరికే ఏ అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వదులుకోవడం లేదు. జిల్లా పర్యటనలు చేస్తూ జగన్ వర్గం శాసనసభ్యులతో ఆయన చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో వారు అడిగిన పనులను మంజూరు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వస్తున్నారు.