గాలి లీజులపై సబితా ఇంద్రారెడ్డిని ఇరికిస్తున్న శ్రీలక్ష్మి
తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు. ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు.
'నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.