సమావేశానికి 13 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలు
సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులతో వైయస్ జగన్ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ వచ్చారు. చివరకు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని శాసనసభ్యులు సమావేశంలో నిర్ణయించారు. రైతు సమస్యలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నందున తాము మద్దతు ఇస్తున్నట్లు సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ తమకు అదే మాట చెప్పారని ఆయన అన్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా శాసనసభ్యులంతా జగన్ వెంటే ఉంటారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని ఆయన అన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా 22 మంది జగన్ వర్గం శాసనసభ్యులు ఓటేస్తారని ఆయన చెప్పారు. జగన్ నిర్ణయానికి కట్టుబడే శాసనసభ్యుల్లో శోభా నాగిరెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది. ఓటింగ్ జరిగే నాటికి అంత మంది జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆరుగురు మాత్రం జగన్ మాటకు కట్టుబడి ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది.