జగన్ పార్టీలో గ్రూపు పాలిటిక్స్, ఓదార్పులో వెలుగులోకి
తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వర్గమంటే, తమను కాదని జూనియర్లకు ప్రాధాన్యమా అని మరోవర్గం ప్రశ్నిస్తోంది. వావి వెంకటరెడ్డికి నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కేటాయించడంతో వ్యతిరేక వర్గం వారు పోటీ సభ నిర్వహిస్తున్నారు. దీంతో తమ సభకే రావాలని ఎవరికి వారు జగన్ను కోరుతున్నారు. వెంకటరెడ్డికి ఇప్పటికే పొన్నూరు నియోజకవర్గం టిక్కెట్ కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో వ్యతిరేక వర్గం వారు అతను స్థానికుడు కాదని స్థానికులకు కాదని అతనికి కేటాయిస్తే సహకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు.
ప్రధానంగా అంబటి రాంబాబు వర్గంలో మాకినేని పెద రత్తయ్య తదితరులు ఉన్నారు. వీరితో జూనియర్ వర్గం తలపడుతోందట. మూడు రోజుల క్రితమే పెద రత్తయ్య గ్రూపు విభేదాల కారణంగా జగన్ను వీడి మళ్లీ టిడిపిలోకి వెళ్లాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చారు. అయితే స్థానిక నేతలు బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. అయితే నాలుగు రోజులు గడవకముందే మళ్లీ మొదటికొచ్చాయి.