బాబూ! రెండు కళ్లు వద్దు: తెలంగాణపై అసెంబ్లీలో గండ్ర
రైతుల సంక్షేమానికి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా చేసిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. ఉపాధి హామీ పథకాల నిధులు బొక్కేసిన ఘనత టిడిపిది అన్నారు. ప్రభుత్వం ఏం తప్పు చేసిందని టిడిపి అవిశ్వాసం పెడుతోందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని మీ శాపనార్థాలతో పడిపోదన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు అవిశ్వాసం పెడుతున్నారా అన్నారు.
ఈ ప్రభుత్వం కూలితే తెలంగాణ వస్తుందన్న వారు ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు అధికారంలో ఉంటేనే తెలంగాణ వస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, కేంద్రంపై తమకు తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదులుకోవాలని సూచించారు. కాంగ్రెసులో ఉండే మేం తెలంగాణ సాధిస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, తెలంగాణ రావాలన్నా ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలన్నారు. అవిశ్వాసంపై టిడిపికి మద్దతిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని సూచించారు. వైయస్ ఆత్మకు శాంతి కలగాలంటే మీరు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.