వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
తాను జారీ చేసిన నోటీసుకు ఈ నెల 29లోగా లిఖితవూర్వకమైన వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని ఆదేశించారు. కాగా, మరోసారి ఈ నెల 27వ తేదీన తన ముందు హాజరు కావాలని స్పీకర్ ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిని ఆదేశించారు. శోభా నాగిరెడ్డి విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఈ చిక్కులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శోభా నాగిరెడ్డికి జారీ చేసిన విప్ చెల్లుతుందా, లేదా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు.
కాగా, తాము విప్ను ధిక్కరించినట్లు అంగీకరిస్తే వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై వెంటనే వేటు పడే అవకాశం ఉంది. వారు అంగీకరించకపోతే కొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. వీరిపై అనర్హత వేటు ఒకేసారి పడుతుందా, లేదా అనేది ఉత్కంఠభరితంగానే ఉంది.