రోడ్డు ప్రమాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి మృతి
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానిది నల్లగొండ జిల్లా. కుటుంబ సభ్యులంతా హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉంటున్నారు. ప్రతీక్ రెడ్డి సిబిఐటిలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జూబ్లీహిల్స్లోని ఇంటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్లగొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి కాంగ్రెసు కార్యకర్తలు, ఇతరులు హైదరాబాదు బయలుదేరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి, నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.