హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపులో భాగమేనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. వైయస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందుకు తాను గతంలోనే రాజీనామా చేశానని అలాంటప్పుడు తాను విప్ ధిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. తన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నప్పుడు విప్ ఎలా వర్తిస్తుందన్నారు.
స్పీకర్ను కలిసి రాజీనామాపై వివరణ ఇచ్చానని, దానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసినట్లు చెప్పారు. రాజీనామా తర్వాత తాను ఒక్కసారి పార్లమెంటుకు హాజరు కాలేదన్నారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. కాగా మంగళవారం లోక్పాల్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా హాజరు కానీ ఎంపీలను కాంగ్రెసు పార్టీ వివరణ కోరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.