వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
26న పీఆర్పీ ఇచ్చే విప్ చెల్లదంటూ శోభానాగిరెడ్డి ఒక లేఖను స్పీకర్ మనోహర్కు రాసి సీల్డ్ కవర్లో ఉంచి శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు ఇచ్చారు. తన రాజీనామా లేఖను కూడా స్పీకర్కు అందజేయాలంటూ మరో కవర్ అందించారు. మరో మూడు రోజులకే తాను విప్ను ఎందుకు ధిక్కరించానో తెలియజేస్తూ మరో లేఖను స్పీకర్ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా శోభా నాగిరెడ్డి పంపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మందిలో కొందరు మాత్రమే తమ వివరణ లేఖలను రాజా సదారాం ద్వారా స్పీకర్కు పంపారు. మరికొందరు ఫాక్స్లో స్పీకర్ కార్యాలయానికి తమ వివరణలు పంపారు. ఈ నెల 9 నుంచి విశాఖ జిల్లాకు వెళ్తున్నందున సంక్రాంతి తర్వాత జగన్వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను ఒక కొలిక్కి తేవాలని మనోహర్ నిర్ణయించారు. దీంతో ఈనెల 18 నుంచి 21లోగా హాజరు కావాలంటూ 17 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు.
ఈ నోటీసుల ప్రకారం ఒక సిట్టింగ్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకునే వీలుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18న శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. 19న అమర్నాథరెడ్డి, శ్రీకాంతరెడ్డి, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గొల్ల బాబూరావు. 20న గుర్నాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ప్రసాదరాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత. 21న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలరాజు, కె.శ్రీనివాసులు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.