జగన్కు రాజా పరిస్థితే: మరోసారి ధ్వజమెత్తిన విహెచ్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్న సాక్షికి ఇబ్బడిముబ్బడిగా పత్రిక ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాస్తే దివంగత వైయస్ ఆ పత్రికలకు ప్రకటనలు ఆపు చేశారన్నారు. ఆయన తండ్రి ఏ పార్టీలో ఉండి కోట్లు సంపాదించారో ఆ పార్టీ అధినాయకత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. అర్హతకు మించి ప్రకటనలు ఇచ్చే విషయమై సమన్వయ కమిటీలో చర్చకు వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే వారికి ప్రకటనలు ఎలా ఇస్తారన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టైనప్పుడు ఆయన గురించి ప్రశ్నిస్తే ఆయన బిజెపి నేత, తనకేం సంబంధమని బుకాయించాడని, కానీ గాలికి చెందిన ఆర్ ఆర్ గోల్డ్ తదితర కంపెనీలు జగన్కు చెందిన సాక్షిలో పెట్టుబడులు పెట్టినట్లు బయటపడిందన్నారు.
రాష్ట్రానికి సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి అబద్దాలాడటం దారుణమన్నారు. సిబిఐ విచారణలో గాలి, జగన్ సంబంధాలు బయటపడ్డాయన్నారు. జగన్పై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించలేదని, ఆయనే సవాళ్లు విసిరి మరీ వేయించుకున్నారన్నారు. దమ్ముంటే జగన్పై సిబిఐ విచారణ వేయాలన్న ఆయన అనుచరులు ఇప్పుడు విమర్శలు చేయడమేమిటన్నారు. 2004లో జగన్ ఆస్తి ఎంత ఆ తర్వాత ఎంత అనే విషయమై రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానన్నారు. తండ్రికి అధికారం ఇచ్చినప్పుడే కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వమంటున్నాడని విమర్శించారు. జగన్ పరిస్థితి కూడా రాజా, సురేష్ కల్మాడీల వలె తయారవుతుందన్నారు.