నెగ్గిన చిరంజీవి: బెడిసికొట్టిన కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం

మంత్రి వర్గ విస్తరణ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడానికి ముందే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వ్యూహానికి ఆయన ప్రతివ్యూహం రచించి అమలు చేశారని అంటున్నారు. రేపు 19వ తేదీన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇవ్వడంతో బొత్స సత్యనారాయణ శిబిరంలో ఆనందం చోటు చేసుకుంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెసు శాసనసభ్యులు బుధవారం తిరుగు ముఖం పట్టారు.
ముఖ్యమంత్రికి కాస్తా ఊరట కలిగించే విషయం - పి. శంకరరావుకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం అనుమతి ఇచ్చిందనే వార్త మాత్రమే. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగిస్తే తెలంగాణ నుంచి మూడు మంత్రి పదవులు ఖాళీ అయినట్లు అవుతుంది. వీటి భర్తీ పేరుతో తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇవి ఇప్పట్లో భార్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. పైగా, రామచంద్రయ్యను మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో బొత్స వర్గం బలపడుతుందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రికి అంత సానుకూలమైన విషయం కాదు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం దెబ్బ తిన్నదని అంటున్నారు.












Click it and Unblock the Notifications