మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు: ఆజాద్
ఆజాద్ తాజా ప్రకటనతో మంత్రి వర్గ విస్తరణ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆజాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రేపు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అని అడిగితే రేపటి సంగతి రేపు చూడవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరిని మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకుని విస్తరణను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. మంత్రివర్గ మార్పులకు, చేర్పులకు తుది దశలో బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచిస్తున్న పేర్లపై, వారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే పార్టీకి కలిగే ప్రయోజనాలపై, కొంత మందికి ఉద్వాసన పలికితే సంభవించే పరిణామాలపై చర్చించిన తర్వాత పునర్వ్యస్థీకరణకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.