జూనియర్ డాక్టర్లతో డిఎల్ రవీంద్రా రెడ్డి చర్చలు విఫలం
జూనియర్ డాక్టర్లతో బుధవారం ఉదయం ప్రభుత్వం జరిపిన మొదటి దశ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సాయంత్రం మరోసారి సమావేశమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 18 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆమరణ దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూడాలు ఆమరణ దీక్షకు దిగారు. అత్యవసర సేవలు కొనసాగిస్తామన్న వారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.
తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతుండగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కుంటామని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెబుతున్నారు. తాము 25 నుంచి 30 శాతం వరకు స్టయిఫెండ్ పెంచుతామని చెబుతున్నామని, దానికి జూనియర్ డాక్టర్లు అంగీకరించడం లేదని, ప్రభుత్వం అంతకన్నా ఏమీ చేయలేదని ఆయన అన్నారు.