సిబిఐ దర్యాప్తు తీరుపై ఐఎఎస్ అధికారుల సమరభేరీ
భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి తెలియకుండా ఐఎఎస్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చునని, అయితే ఇతరులు తీసుకునే నిర్ణయాలకు తాము ఎలా బాధ్యులం అవుతామని ఆయన అన్నారు. ఇతరులు తీసుకున్న నిర్ణయాలకు ఐఎఎస్ అధికారులను బలపశువులను చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతరులు ఎవరనే విషయం చెప్పడానికి ఆయన నిరాకరించారు. వేరేవాళ్లను వదిలేసి సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని ఆయన విమర్శించారు. తాము మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తామని, ముందూ వెనకా చూడకుండా సిబిఐ తమను వేధిస్తోందని ఆయన అన్నారు. ఇతరులు తీసుకునే నిర్ణయాలకు బ్యూరోక్రాట్లను బాధ్యులను చేయడం సరి కాదని ఆయన అన్నారు.
సిబిఐ దర్యాప్తులో ప్రోద్బలాలు పనిచేస్తున్నాయని భావిస్తున్నారా అని అడిగితే తాను ఎలా చెప్పగలనని, ప్రభుత్వ సేవకుడిగా తాను ఇంతకు మించి చెప్పలేనని ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వంలో సమర్థత, పారదర్శకత ఉండాలని ఆయన అన్నారు. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం తమకు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఐఎఎస్ల పరిధిని,
అధికారాలను సిబిఐ తెలుసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు అంటున్నారు. ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రా, రమాకాంత్ రెడ్డి వంటివారిని సిబిఐ ప్రశ్నించడం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి వంటి ఐఎఎస్ అధికారులను అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు తీవ్రమైన కలవరానికి గురైనట్లు కనిపిస్తున్నారు.