ఐఎఎస్లకు సిఎస్ పంకజ్ షాక్: భయమెందుకని ప్రశ్న
సీబీఐ విచారణల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కొందరు అధికారులు అంటున్నారని, సీబీఐ విచారణ సందర్భంగా హింసిస్తున్నారన్న కొందరు ఐఏఎస్లు అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని, నిబంధనల ప్రకారం పని చేస్తే ఎలాంటి సమస్యలూ ఎదురు కావని ఆయన చెప్పారు. తామంతా ప్రజాసేవలో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామని, కొన్నిసార్లు కఠిన దశను ఎదుర్కోవచ్చని చెప్పారు. అఖిల భారత సర్వీసులు గొప్ప ఉద్యోగమని, ఎవ్వరూ మనోనిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఈ సంఘటనల వల్ల ఐఏఎస్ల నైతికత దిగజారబోదని అభిప్రాయపడ్డారు. "ఎవ్వరూ మనోనిబ్బరం కోల్పోవద్దు. న్యాయ వ్యవస్థపై మనకు విశ్వాసం ఉండాలి. దానికంటే ముందు మనం చేస్తున్న సేవపై మనకు నమ్మకం ఉండాలి. వ్యక్తికంటే వ్యవస్థ ఎప్పుడూ గొప్పది'' అని ఐఏఎస్ అధికారులకు పిలుపునిచ్చారు. కాగా.. కొందరు నీతిపరుల పేర్లు కూడా చార్జిషీటులో ఉన్నాయి కదా అని అడగ్గా.. "చార్జిషీటులో పేరున్నంత మాత్రాన ఎవరూ అపరాధి అయిపోరు. చార్జిషీటులో పేరుంటే కోర్టు ఆ వ్యవహారాన్ని చూసుకుంటుంది. ఆరోపణలు రుజువు కాకపోతే.. సదరు వ్యక్తి బయటకు వస్తారు'' అని బదులిచ్చారు.
రాష్ట్రంలో మంచి అధికారులున్నారని, గతంలో తామంతా చాలా మంచి పనులు చేశామని, భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పనులు చేస్తామని చెప్పారు. తద్వారా మళ్లీ పునర్ వైభవాన్ని సంతరించుకుంటామన్నారు. తమలో కొందరు అధికారులు.. డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా పనిచేయకుండానే నేరుగా సెక్రటరీలు అయిపోతారని చెప్పారు. అలాంటి సందర్భాల్లో నిబంధనలు సమగ్రంగా తెలియక వారు ఇబ్బందులు పడొచ్చని ద్వివేదీ అన్నారు. తాను దాదాపు సంవత్సరం పాటు ప్రధాన పరిపాలనా శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశానని, ఆ సమయంలోనే ఫైలు ఎలా తయారవుతుందో తాను తెలుసుకున్నానన్నారు. 'నువ్వే మొత్తం కేసు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించను. కేవలం సంతకం మాత్రమే చేస్తాను' అంటూ అప్పటి సెక్రటరీ తనతో అనే వారని, ఆ విధంగా తాను మొత్తం పని నేర్చుకోగలిగానన్నారు.