చిదంబరానికి ఊరట, స్వామి పిటీషన్ కొట్టివేత
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పాత్రపై సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడానికి ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పాటియాలా హౌస్ కోర్టులోకి మీడియా ప్రతినిధులను అనుతించలేదు. చిదంబరంపై కోర్టు వెలువరించే తీర్పు కోసం కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు తదితరులు గుమికూడారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ విషయాన్ని కింది కోర్టు మాత్రమే తేలుస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా కోర్టు హాల్లోకి అనుమతించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, కోర్టు ముందు చిదంబరం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని, చిదంబరానికి వ్యతిరేకంగా తాను అన్ని పత్రాలు సమర్పించానని, దాదాపు 2 వేల పేజీల పత్రాలు సమర్పించానని, న్యాయం జరుగుతుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన శనివారం ఉదయం అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర లేదని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. వ్యక్తిగత కక్షతోనే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారని ఆయన ఆరోపించారు.