ప్రసాద్ కుమార్తో సబితకు చెక్: రెండో పవర్ సెంటర్
సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా ఏకమై జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో ప్రసాద్కుమార్తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్తో పాటు మరికొందరు సీనియర్లు సబితతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు మేడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఒక సమయంలో ఆయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేందరినీ కూడగట్టి సబితను ఒంటరిని చేసే యత్నం చేశారు. తరువాత సబిత కొందరిని తనవైపు తిప్పుకోవడంతో పార్టీలో కొంత బలోపేతం అయ్యారు. అయితే.. ప్రసాద్ కుమార్, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి మాత్రం వేరు వర్గంగానే ఉంటున్నారు. సబిత పాల్గొనే కార్యక్రమాలకు కూడా వారంతా దూరంగా ఉంటున్నారు.
తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్లో ఆదివారం జరిగిన మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ప్రసాద్కుమార్ దూరంగా ఉన్నారు. ఈ పోలీస్స్టేషన్ను హోంమంత్రి సబితారెడ్డి ప్రారంభించడంపై ప్రసాద్ అలకవహించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తేదీలు ఖరారు చేసి తరువాత ఆహ్వానం పంపారని ఆయన సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ నచ్చచెప్పినా కూడా ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ఇప్పుడు ప్రసాద్కు మంత్రి పదవి లభించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో సబిత, ప్రసాద్ల మధ్య అధిపత్యపు పోరు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.