వైయస్ కన్నా ముందు ఎన్టీఆర్ మాత్రమే: జగన్
చేనేత కార్మికుల సమస్యలపై అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు రోజుల పాటు చేపట్టిన దీక్షను ఆయన మంగళవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అల్లుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పథకాన్ని ఎత్తేశారని ఆయన విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జారీ జీవోల గురించి ఆయన వివరించారు. చేనేత కార్మికుల గురించి, చదువుకునే విద్యార్థుల గురించి ఆలోచించే నాథుడు రాష్ట్రంలో లేకుండా పోయారని ఆయన అన్నారు.
ధర్మవరంలోనే రెండేళ్లలో 15 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. చేనేత కార్మికులు ఎందుకు చనిపోతున్నారని, వారికి వచ్చిన కష్టాలు ఏమిటి అనే నాథుడు కూడా రాష్ట్రంలో లేడని ఆయన అన్నారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. పెరిగిన ధరలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా విధానాలు మారుస్తోందని ఆయన అన్నారు. చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆయన అన్నారు.
నూలు, జరీ ధరలు 200 శాతం పెరిగాయని, చీరల ధరలు పెంచితే కొనేవారు లేకుండా పోయారని, గిట్టుబాటు కాకపోతే చేనేత కార్మికులు ఎలా జీవిస్తారని ఆయన అడిగారు. ఒక్కో కుటుంబం వారం రోజులు పనిచేసినా 600 రూపాయలు కూడా దక్కడం లేదని ఆయన చెప్పారు. చేనేత, పవర్లూమ్స్లను రెండు కళ్లుగా భావించాలని, లేకుంటే రెండు కళ్లు కూడా పోతాయని ఆయన అన్నారు. చేనేతపై ఆంక్షలు విధించడం దారుణమని ఆయన అన్నారు.