గాడి తప్పిన సభ: అసెంబ్లీలో సిఎంకు చంద్రబాబు సవాల్
మోపిదేవికి సిఎం క్లీన్ చిట్ ఎలా ఇస్తారన్నారు. కాంగ్రెసు నుండి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏ సిఎం ఇంత నీచంగా మాట్లాడలేదన్నారు. సిఎం దోషులను సమర్థిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని తాము ఎవరినీ వదలే సమస్య లేదన్నారు. ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి లేరన్నారు. నా రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో పని చేశానన్నారు. అంతర్గత విభేదాలలో కూరుకుపోయి కిరణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో మండిపడ్డారు. సిగ్గు, శరం మాకు నీదగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, నీ చరిత్ర నాకొద్దని, టిడిపి ఆఫీసులో చెప్పుకో అని ఎద్దేవా చేశారు. బాబు చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించాలని స్పీకర్ను కోరారు. ఆరోపణలు వచ్చినప్పుడు బాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. టిడిపి నేతలు వారి ఆఫీసులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవచ్చునని ఇక్కడ మాట్లాడవద్దన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. లిక్కర్ కేసులో నిందితుడు అయి ఉండి చంద్రబాబు సిగ్గు లేకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా ఉన్నాయా అన్నారు. బాబులా సభలో ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. సిగ్గు, లజ్జ లేనిది వారికేనని మండిపడ్డారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత దాపురించడం మన ఖర్మ అన్నారు. బాబు మాటలు సభా గౌరవాన్ని కాపాడేలా లేవన్నారు. బాబుకు నైతికత లేదన్నారు. తాను గాలి ముద్దుకృష్ణమలా దిగజారి మాట్లాడలేనన్నారు. బాబు చేసేది నిరసనా ప్రసంగమా అని అడిగారు. నిత్యం బాబు గుండెల్లో నిద్రపోతానని అంటారని, తనకు అంత విశాలమైన హృదయం లేదన్నారు. ఆయన విశాల హృదయాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావే తట్టుకోలేక పోయారన్నారు. కాగా సభలో కాంగ్రెసు, టిడిపిల వైఖరికి నిరసనగా బిజెపి, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అధికార, ప్రతిపక్షాల తీరును అక్బరుద్దీన్ తప్పు పట్టారు. దీంతో సిఎం, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది.
బిజెపి, ఎంఐఎం వాకౌట్ తర్వాత సభ కొనసాగింది. ముఖ్యమంత్రి ఉద్రేకానికి లోనవుతున్నారని, తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నరని, వెనుకబడిన వర్గాలంటే టిడిపికి అపార గౌరవం ఉందని అన్నారు. మంత్రి హోదాలో మోపిదేవి సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. వచ్చిన అవకాశాన్ని సిఎం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.