జగన్ వర్గం ఎంపి మేకపాటి రాజీనామా ఆమోదం
జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి లోకసభ స్పీకర్ మీరా కుమార్ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం పిలుపు వచ్చింది. రాజీనామాపై స్పీకర్ ముందు హాజరు కావాలని ఆమె కార్యాలయానికి చెందిన సిబ్బంది ఫోన్ చేసి మేకపాటి రాజమోహన్ రెడ్డికి చెప్పారు. నిరుడు ఆగస్టులో మేకపాటి రాజమోహన్ రెడ్డి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పీకర్కు చెప్పారు.
సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు మనస్తాపానికి గురై మేకపాటి రాజీనామా చేశారు. నిజానికి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెసు నుంచి తప్పుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయన కీలక నాయకుడిగా ఉన్నారు. పార్టీ కార్యాచరణలో ఆయన ప్రధాన భూమిక పోషిస్తున్నారు.