ఆయన జాగీరా?: లష్కర్పై అంజన్కు ముఖేష్ కౌంటర్
కాగా వచ్చే ఎన్నికల్లో సికిందరాబాద్ ఎంపిగా తాను పోటీ చేస్తానని మంగళవారం ఉదయం ముఖేష్ గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే. అంజన్ ముషీరాబాద్ నుండి బరిలోకి దిగుతారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై అంజన్ సాయంత్రం స్పందించారు. సికింద్రాబాద్ ఏమైనా ముఖేష్ సొంతమా.. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నెస్తే ఖబర్దార్ అంటూ నిప్పులు చెరిగారు. తాను ఎక్కడి నుండి చేయాలో చెప్పడానికి ముఖేష్ ఎవరు అన్నారు. ఆయన ఏమైనా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదా వాటి ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అన్నారు.
అసలు రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరమేమొచ్చిందని అన్నారు. 2004లో సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని సమయంలో తాను ధైర్యంగా బండారు దత్తాత్రేయపై పోటీ చేసి గెలిచానని అన్నారు. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచానన్నారు. ప్రజల్లోకి వెళ్లే వారికే గుర్తింపు ఉంటుందే తప్ప, పైరవీలు చేసి బతికేవారికి పరాభవం తప్పదన్నారు.