వైయస్సార్ జమానాలో చక్రం తిప్పిన ఎసి రెడ్డి?
వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు నిర్దేశించడం వల్లనే సాక్షి పత్రికకు భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి, ఇతర ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక అదేశాలు రావడం వల్లనే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఎ చంద్రశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి ఎ. చంద్రశేఖర రెడ్డి సూచన మేరకే ప్రకటనలు ఇస్తున్నట్లు అప్పట్లో ఓ ఫైలులో సమాచార శాఖ అధికారులు నోట్ చేశారు. దీంతో ఆయనను సిబిఐ గురువారం రెండున్నర గంటల పాటు విచారించింది. తాను వార్తలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూశానని, వాణిజ్య ప్రకటనల వ్యవహారం తనకు తెలియదని అతను సిబిఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అప్పటి సమాచార కమిషనర్ పార్థసారథిని రప్పించి, ప్రశ్నిస్తూ మధ్యలో పక్క గదిలో ఉన్న చంద్రశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు పిలిచారు. ఆ తర్వాత పార్థసారథిని పంపించేసి చంద్రశేఖర రెడ్డిని మళ్లీ విచారించారు.