జగన్, అఖిలేష్, మోడి...: రాహుల్ గాంధీకి పెద్ద సవాల్
అఖిలేష్ తన ప్రచారంలో ప్రధానంగా యువతని ఆకర్షించారు. అదే సమయంలో రాహుల్ మాత్రం యువతను ఆకర్షించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రచారం సమయంలో చిత్తుకాగితాలను చించేస్తూ విపక్షాల మేనిఫెస్టోను వాటితో పోల్చడం తదితర అంశాలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయంటున్నారు. తాము అధికారంలోకి వస్తే రౌడీల పాలన ఉండదని, అభివృద్ధి, సంక్షేమం పైనే దృష్టి సారిస్తామని అఖిలేష్ సామాన్యులను కూడా బాగా ఆకర్షించారు. ఇన్నాళ్లూ దేశంలో రాహుల్ గాంధీ ఒక్కరే యూత్ ఐకాన్గా ఉండేవారు. కానీ దేశంలోనే అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ రేసులోకి దూసుకు వచ్చారు. రాహుల్ను వెనక్కి నెట్టేశాడు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ తనయుడు జయంత్ సింగ్ కూడా రాహుల్ కంటే యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడని అంటున్నారు. యుపిలో రాహుల్ మేనియా దెబ్బతినడంతో భవిష్యత్తులో ఆయా రాష్ట్రాలలో యూత్ ఐకాన్గా స్థానిక నేతలే ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తద్వారా కాంగ్రెసు దెబ్బతినే అవకాశముందంటున్నారు.
ఇప్పటికే దక్షిణ భారత దేశంలో పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి యూత్ ఐకాన్గా ఎదిగారు. ఆయనపై సిబిఐ దర్యాఫ్తు, అరెస్టులు తదితర విషయాలు పక్కన పెడితే ఎపిలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. యువత దాదాపు ఆయన వైపు చూస్తోంది. అందుకే అక్కడ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీలు యువతను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ను సామాన్యులు ఆదరిస్తున్నారు. ఇక గుజరాత్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రాభవం ముందు జగన్ దిగదుడుపే అంటున్నారు. మోడీని మించిన ఐకాన్ ఆ రాష్ట్రానికి లేరంటున్నారు. ఆ ఇమేజే ఆయనను బిజెపి ప్రధాని పదవి అభ్యర్థికి పరిశీలించే పరిస్థితి కల్పించిందని చెప్పవచ్చు. ఇక మహారాష్ట్రలో నవనిర్మాణ సేన్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తదితరులను ఎదుర్కోవడం కష్టమే అంటున్నారు.