రాజ్యసభకు చిరుంజీవి, రేణుకా చౌదరి ఖరారు
ఈ నెలాఖరులోగా రాజ్యసభకు కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వచ్చి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ను గురువారం సాయంత్రం కలుసుకోవడంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందన్న ఊహాగానాలు బయల్దేరాయి. మార్చి 12 తర్వాతే ఈ విషయంపై అధికారికంగా చర్చలు జరుగుతాయని, బుధవారం ఆజాద్ పుట్టినరోజు కావడంతో గురువారం వచ్చి అభినందనలు తెలిపానని బొత్స చెప్పారు.
రేణుకా చౌదరి, చిరంజీవితో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు రాజ్యసభ అవకాశం లభించవచ్చునని రాజకీయవర్గాలు అంటున్నాయి. మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, ముఖ్యమంత్రికి న్యాయసలహాదారుగా ఉన్న వరంగల్ మాజీ ఎంపీ సురేందర్రెడ్డి కుమారుడు రఘు రెడ్డి, పెన్నా ప్రతాప్రెడ్డిలతో పాటు వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూడా రంగంలో ఉన్నారు. సోనియాను ఇప్పటికే కలుసుకున్న వివేకానంద రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఆజాద్ను, ఇతర నేతలను కలుసుకున్నారు.