అఖిలేషా, ములాయమా: సిఎంపై తొలగని సస్పెన్స్
ఎస్పీలోని సీనియర్ ఎమ్మెల్యేలు ములాయం సిఎం కావాలని పట్టుపట్టుతుండగా, యువ నేతలు మాత్రం అఖిలేష్కు ఓటు వేస్తున్నారట. ములాయం, అఖిలేష్ కోసం ఎస్పీలు రెండు వర్గాలుగా చీలి పోయాయని అంటున్నారు. ప్రధానంగా యువ ఎమ్మెల్యేలు అఖిలేష్ కోసం బాగా పట్టుపట్టుతున్నారట. అయితే ములాయం నిర్ణయం కోసం పార్టీ వర్గాలు వేచి చూస్తున్నాయట. నిర్ణయాన్ని పార్టీ చీఫ్ ములాయం చేతిలోనే పెట్టామని, తానా లేక తన తనయుడా అనే నిర్ణయాన్ని ఆయనే ప్రకటించాల్సి ఉందని, అయితే మూడో వ్యక్తికి మాత్రం అవకాశం లేదని నేతలు చెబుతున్నారని అంటున్నారు. మరోవైపు యుపి సిఎం తన తండ్రే అవుతారని ప్రకటించిన యువనేత అఖిలేష్ మాత్రం మంత్రి వర్గం లిస్టును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారట. క్రిమినల్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా లిస్టు తయారు చేస్తున్నారట.
శనివారం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేసి, సోమవారం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంశంపై నరేష్ అగర్వాల్, రాంగోపాల్ యాదవ్ వంటి నేతలు బుధవారం జరిగిన సమావేశంలో అఖిలేష్ వైపు మొగ్గు చూపారట. సీనియర్ నేతలైన శివపాల్ యాదవ్ వంటి వారు మాత్రం ములాయంకు ఓటు వేస్తున్నారట. అయితే ఎవరూ ఓపెన్గా మాట్లాడటం లేదని అంటున్నారు. ప్రస్తుతం ములాయం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని, అఖిలేష్ సిఎం కావాలంటే 2014 లోకసభ ఎన్నికల వరకు కాస్త పరిణితి సాధించి ఆ తర్వాత అయితే బాగుంటుందని చెబుతున్నారట. అయితే యువ ఎమ్మెల్యేల వాదన మరోలా ఉందంట. ములాయం ఇప్పుడే అఖిలేష్కు సిఎం పదవి అప్పగించి, ఇప్పటి నుండే 2014 లోకసభ ఎన్నికలపై దృష్టి సారిస్తే బాగుంటుందని చెబుతున్నారట.