వైయస్ వివేకా: జగన్కు దూరమై, కాంగ్రెస్కు పట్టక
మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనను పట్టించుకున్నవారు లేరు. వైయస్ కుటుంబానికి దగ్గర కావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వైయస్ జగన్ కాస్తా సానుకూలంగా ఉన్నా, వైయస్సార్ సతీమణి విజయమ్మ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెసులోనే ఏదో పదవిని పొందాలనే ఉద్దేశంతో రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగించినట్లు చెబుతారు. కానీ తన పేరును రాజ్యసభకు ప్రతిపాదించేవారే లేకుండా పోయారు.
ఈ స్థితిలో ఆయన కాంగ్రెసు నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కకపోతే మరో ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దీంతో తనను పార్టీ మోసం చేస్తోందనే భావనకు ఆయన గురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో తాను పులివెందులలోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ నాయకులు తిరిగి తన వద్దకు వచ్చినప్పుడే చూసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.