సిబిఐ సూచనలతో గాలి పిఏ అలీఖాన్ లొంగుబాటు?
ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అలీ ఖాన్ ఆచూకీని వారు కనిపెట్టారట. అలాగే, బళ్లారి పిడబ్ల్యూడిలో డిఈగా పనిచేసే అలీ ఖాన్ మామ ద్వారా కర్ణాటక సిబిఐ అధికారులు అనేక విషయాలు రాబట్టారని సమాచారం. బెంగళూరు, గోవా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలుసుకుని కర్ణాటక సిబిఐలోని ఒక ఉన్నతస్థాయి అధికారి తరచూ అలీ ఖాన్తో మాట్లాడేవారనే వాదనలు వినిపిస్తున్నాయి. సిబిఐ అధికారులు చాలా సందర్భాల్లో అలీ ఖాన్ను బెంగళూరులోని కొన్ని రహస్య ప్రదేశాల్లో లేదా లాడ్జిల్లో కలిసి కావాల్సిన సమాచారం రాబట్టుకునేవారట. బెంగళూరులో సిబిఐ ఆధికారుల ఎదుట అలీ ఖాన్ లొంగిపోయే ముందు రోజు చాలామందికి ఆ సమాచారం తెలిసిపోయిందట. ఇది సిబిఐ ఆడించిన డ్రామాగానే గాలి వర్గీయులు భావిస్తున్నారు.
కాగా అలీ ఖాన్ను బెంగళూరు నుంచి సిబిఐ అధికారులు భారీ బందోబస్తు మధ్య మంగళవారం రాత్రి 8.00 గంటలకు బళ్లారికి తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి నేరుగా బళ్లారి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాత్రి పది గంటల వరకు ఉంచి అనంతరం గాంధీనగర్ పోలీసుస్టేషన్కు తరలించారు. అలీ ఖాన్ వస్తున్న విషయం తెలిసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం అలీఖాన్తో సిబిఐ అధికారులు ఏఎంసీ గనుల ప్రాంతాన్ని, వివిధ బ్యాంకుఖాతాలు, లాకర్లను పరిశీలించే అవకాశముంది. ఇప్పటికే బుధవారం ఉదయం ఆయనకు సిబిఐ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.