విద్యార్థులకు చుక్కలు చూపిన ఇంటర్ ఫిజిక్స్ పేపర్!
ఈ ప్రభావం ఎంసెట్ ర్యాంకుల పైనా పడుతుందని అంటున్నారు. ప్రశ్నపత్రంలో పరమాణు భౌతిక శాస్త్రంలో ఆరు మార్కులకు ప్రశ్న ఇవ్వాల్సి ఉండగా పది మార్కులకు ఇచ్చారట. అదే విధంగా కేంద్రక భౌతికశాస్త్రంలో 8 మార్కులకు బదులు 10 మార్కులకు, ఎల్రక్టానిక్స్లో 6 మార్కులకు ఇవ్వాల్సి ఉండగా 8 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారట. అదే విధంగా అర్ధ వాహకాలులో 6 మార్కుల ప్రశ్నకుగాను 8 మార్కుల ప్రశ్న ఇచ్చారని, రేఖాశాస్త్రంలో 4 మార్కులకు ప్రశ్న ఇవ్వాల్సి ఉండగా 8 మార్కులకు ఇచ్చారని అంటున్నారు. మరోవైపు పేపర్ కష్టంగా రావడాన్ని కూడా తప్పుపట్టలేమని మరికొందరు అంటున్నారు. ఆ స్థాయిలో విద్యార్థులను తయారు చేయలేకపోయిన లెక్చరర్లు, పేపర్ ఎలా వచ్చినా రాయడానికి సన్నద్ధం కాలేకపోయిన విద్యార్థులదే తప్పు అని పలువురుఅభిప్రాయపడుతున్నారు. సిలబస్లో ఉన్న ప్రశ్నలే ఇచ్చినా బ్లూప్రింట్ ప్రకారం ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తుండగా, బ్లూప్రింట్ అనేది ఒక నమూనా మాత్రమేనని దీన్ని కచ్చితంగా అనుసరించాలని లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ ప్రాంత విద్యార్థులు దాదాపు 40 రోజుల పాటు చదువుకు దూరం కావటంతో ఫిజిక్స్ పేపర్ వారి పాలిట శాపంగా మారిందన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇక 4 మార్కులకు అడిగిన 15వ ప్రశ్నలో యూనిట్స్ తప్పు ఇచ్చారు. ఎంసెట్లో ఇంటర్ ఆప్షనల్స్ మార్కులకు వెయిటేజ్ ఇవ్వకుంటే ఇంతటి బేలతనం విద్యార్థుల్లో కనిపించకపోయేది. ఫస్టియర్ ఫిజిక్స్లో 60కి 60 తెచ్చుకున్న విద్యార్థులు సైతం ఇప్పుడు 30 లేదా 40 వస్తే గొప్పే అంటున్నారు. ఫలానా చాప్టర్లో ఇన్ని మార్కులకే ప్రశ్నలు ఇస్తారని కాలేజీల్లో అధ్యాపకులు చెబుతుండటం వల్ల విద్యార్థులు అందుకు అనుగుణంగానే ప్రిపరేషన్ కొనసాగిస్తుండటం గమనార్హం.