జగన్ కేసులో శ్రీలక్ష్మి, రాజగోపాల్ విచారణకు అనుమతి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మిని, రాజగోపాల్ను విచారించేందుకు హైకోర్టు శుక్రవారం సిబిఐకి అనుమతి ఇచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వారిద్దరి విచారణకు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ఇంతకు ముందు సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. తాజా హైకోర్టు ఆదేశాలతో ఆ ఇద్దరు అధికారులను సిబిఐ విచారించేందుకు మార్గం సుగమమైంది.
ఆ ఇద్దరు అధికారులను సిబిఐ అధికారులు రేపు (శనివారం) హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ప్రశ్నించే అవకాశం ఉంది. రేపటి నుంచి సిబిఐ అధికారులు వారిని ప్రశ్నిస్తారు. న్యాయవాదుల సమక్షంలోనే శ్రీలక్ష్మిని, రాజగోపాల్ను విచారించాలనే ప్రతివాదుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఆ ఇద్దరు అధికారులు జీవోలు జారీ చేశారని సిబిఐ అనుమానిస్తోంది. దీంతో వారిద్దరి విచారణకు హైకోర్టు నుంచి అనుమతి పొందింది.