ఓటర్లపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నాగం వర్గంతో ఘర్షణ
బిక్కనూరు మండలంలోని బస్సాపూరు గ్రామంలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ డిఎస్పీ రామ్మోహన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బస్సాపూర్ వచ్చిన గోవర్ధన్ వాహనాన్ని డిఎస్పీ పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతించలేదు. దీంతో గంప వాహనం దిగి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు టిడిపి అభ్యర్థి వాహనంపై ఉండటాన్ని చూసిన గోవర్ధన్ డిఎస్పీని నిలదీశారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డిఎస్పీ టిడిపి అభ్యర్థి వాహనాన్ని కూడా అక్కడి నుండి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. కాగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మూడు పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిడిపి వేణుగోపాల రావు కామారెడ్డిలో, కాంగ్రెసు రాజిరెడ్డి రామేశ్వరపల్లి, టిఆర్ఎస్ గంప బస్వాపూర్లో ఓటు వేశారు.
కాగా ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటింగులో పాల్గొంటున్నారు. తొలి రెండు గంటల్లోనే మహబూబ్ నగర్ జిల్లాలో నియోజకవర్గాల్లో 14 శాతం, అదిలాబాదులో 9 శాతం, నెల్లూరులో 11 శాతం, స్టేషన్ ఘనపూరులో 18 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కువ చోట్ల తొలి రెండు గంటల్లోనే భారీగా పోలింగ్ నమోదవ్వడం విశేషం. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పార్కు సెంటరు సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఓటరు స్లిప్పులు పంచే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.