'కడప' దాటిన జగన్కు తొలి సవాల్: పరువు దక్కేనా
జగన్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కోవూరులో ప్రసన్న గెలుపుతో పాటు, ఆయన సాధించే మెజారిటీ కూడా ముఖ్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోవూరులో ప్రసన్న ఓడిపోతే ఒక రకంగా జగన్తో పాటు, ఆయన పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రసన్న గెలిచి, మెజారిటీ తక్కువగా వచ్చినా జగన్ పార్టీకి ఇబ్బందికరమేనని చెబుతున్నారు. అప్పుడు జగన్కు కడపలో తప్ప మిగిలిన చోట్ల పట్టు లేదనే ప్రచారం సహజంగానే తెర పైకి వస్తుంది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు జగన్కు వ్యతిరేకంగా మరింత క్రియాశీలకమవుతాయి. ఇది త్వరలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవూరు ఉప ఎన్నిక జగన్కి, ఆయన పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
స్వయంగా జగనే బరిలో ఉన్నంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికను ఆ పార్టీ నేతలు తీసుకుంటున్నారు. ఇక్కడ తమ పార్టీ గెలిస్తే జగన్ గెలిచినట్లేనని, ఓడితే జగన్ ఓడిపోయినట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానమే తమకు ఓట్లు కురిపిస్తుందని తొలుత భావించినా, జగన్ రోడ్షోలు వెలవెలపోయినట్లుగా వార్తలు రావడం, మైపాడులో మత్స్యకారులపై జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాడులు చేసిన ఉదంతాలు వారిని కలవరపరుస్తున్నాయట.