నల్లపురెడ్డి మెజార్టీపై కోట్లాది రూపాయల బెట్టింగులు?
నల్లపురెడ్డికి 29 వేల మెజార్టీ ఖాయమని పార్టీ నేత ఒకరు, పదివేల మెజార్టీ వస్తుందని మరో పార్టీ నేత లక్షలు లక్షలు పందెం కాశారట. ప్రధానంగా 20 వేలకు పైగా మెజార్టీ వస్తుందంటూ పెద్ద ఎత్తున పందాలు కడుతున్నారట. కోవూరులో ఉన్న నేతల ద్వారా, మీడియా ద్వారా వివరాలు తెలుసుకుని ఓటింగ్ సరళిని అంచనా వేసుకొని మరీ వివిధ జిల్లాల్లో పందేలు కాస్తున్నారట. ఏ కులం వారు ఏ పార్టీకి ఓటు వేశారో అంచనా వేస్తూ మొత్తంపై ఎవరు గెలిచే అవకాశం ఉందో ఊహిస్తున్నారట. నిత్యం క్లబ్ల్లో గడిపే పేకాటరాయుళ్లు సైతం తమ దృష్టిని ప్రస్తుతం ఇటువైపు మళ్లించారని అంటున్నారు. కౌంటింగ్ బుధవారం జరుగుతున్నందున మంగళవారం సాయంత్రం వరకు కూడా పందాల పరంపర జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కడప లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో జగన్కు రెండు లక్షలకుపైగా మెజార్టీ వస్తుందని పెద్ద ఎత్తున పందాలు జరిగాయనే వార్తలు వినిపించాయి. ఊహించని విధంగా అంతకంటే ఎక్కువ మెజార్టీ రావడంతో జగన్ అభిమానులు కోట్ల రూపాయలను ఆర్జించారు. ఒక్క ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోనే రూ.100 కోట్లకు పైగా చేతులు మారాయని సమాచారముందని చెబుతున్నారు.
అప్పట్లో గెలిచిన వారిలో ఎక్కువమంది ఇప్పుడు మళ్లీ బెట్టింగ్లు కాస్తున్నారట. ఇక, ఉప ఎన్నికల్లో రెండో స్థానం టీడీపీదా? కాంగ్రెస్దా అన్నదానిపైనా పందాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిదే విజయమంటూ ఆ పార్టీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ ఒకవేళ ఓడినా తమ అభ్యర్థి రెండో స్థానంలో ఉంటారని బెట్టింగ్లు కాస్తున్నారట. కాంగ్రెస్ అభిమానులదీ ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. కోవూరు మెజార్టీపై కడప జిల్లాలో సుమారు రూ.6 కోట్లమేర బెట్టింగ్ జరిగినట్లు సమాచారముందని అంటున్నారు. జిల్లావాసులే కాకుండా హైదరాబాద్, చెన్నై, నెల్లూరుకు చెందిన వారు బెట్టింగ్కు దిగారు. నోటిఫికేషన్ వెలువడిన తొలి రోజుల్లో ప్రసన్న 50 వేల మెజారిటీతో గెలుస్తాడని బెట్టింగ్లు జరిగినప్పటికీ క్రమేణా అది తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. ప్రస్తుతం 15 నుండి 25వేల మెజార్టీకి పందేలు కాస్తున్నారట.