బాబుపై జగన్ విమర్శల దూకుడు: తొలిసారి అవినీతిపై
కోవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై జగన్ నిప్పులు చెరిగారు. బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని ధ్వజమెత్తారు. మద్యాన్ని ఏరులుగా పారించి పల్లెలకు కూడా విస్తరింపజేసిన ఘనత చంద్రబాబుదేనని, రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కోర్టులను, సీబీఐని చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని సీబీఐ కేసులను తప్పించుకున్న ఘనత చంద్రబాబుదేనని, తనకు ఆ ఖర్మ పట్టలేదని, దేవుడిని నమ్ముకొని ఉన్నానని అన్నారు. రెండెకరాల చంద్రబాబు ఆస్తులు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. వైయస్ ప్రభుత్వ హయాంలో తాను ఐఎఎస్ అధికారికి ఒక్కరికైనా ఫోన్ చేసినట్లు చంద్రబాబు నిరూపించగలరా అని ఆయన అడిగారు.
ప్రజల అండదండలు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ అధికారంలోకి రాకుండా టీడీపీ, కాంగ్రెస్లు వ్యవహరిస్తున్నాయని.. తమలో ఏ ఒక్కరో మాత్రమే అధికారంలోకి రావడం కోసం మూడో పార్టీని తొక్కేస్తున్నాయని ఆరోపించారు.