జానా ఇంట్లో టి-ఎంపీల భేటీ, 'తెలంగాణ'పై వ్యూహ రచన
కాగా ఎంపీలు సమావేశమైన మంత్రి జానా రెడ్డి నివాసం ముందు తెలంగాణ జాగృతి విద్యార్థి ఆందోళన నిర్వహించారు. జానా ఇంటిని ముట్టడించి జై తెలంగాణ నినాదాలు చేశారు. జానారెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రకటించేలా ఒప్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని ఎంపీలను తెలంగాణ జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యా నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
భేటి అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బోజ్యా మృతికి అందుబాటులో ఉన్న ఎంపీలం భేటీ అయి సంతాపం తెలిపామని చెప్పారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. పార్లమెంటు సభ్యులుగా మా బాధ్యతగా మేం తెలంగాణ సాధన కోసం మా ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ ఆలస్యానికి ఎవరు బాధ్యులు అయినా ఆత్మహత్యలకు హామీలు ఇచ్చిన అన్ని పార్టీలది అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అందరి లక్ష్యం తెలంగాణ అన్నారు. అందుకోసమే మా పోరాటమన్నారు. తెలంగాణ సాధనే మా లక్ష్యమన్నారు. ఎవరి అజెండాతో మాకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు.