కొనసాగుతున్న బంద్: ఓయులో బైక్ ర్యాలీ, అరెస్ట్
అయితే బస్సులు మినహా రోడ్ల పైన మిగతా వాహనాలు కనిపించడం లేదు. బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ పార్టీల కార్యకర్తలు తెలంగాణ జిల్లాల్లో రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీలు తీస్తున్నారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బైక్ ర్యాలీ తీస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు మాణిక్యేశ్వర నగర్ నుంచి తార్నాక వైపు ర్యాలీ నిర్వహిస్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయు ఎన్సిసి గేటు వద్ద కూడా బైక్ ర్యాలీ తీస్తున్న ఎబివిపి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి.
వ్యాపార, వాణిజ్య, పెట్రోల్ బంక్, సినిమా హాళ్లు పది జిల్లాల్లో మూతపడ్డాయి. కార్యకర్తలు తెరిచి ఉన్న దుకాణాలు మూసి వేయిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు 24 గంటల బంద్ నిర్వహిస్తున్నారు. కాగా కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో బంద్కు సహకరించని ఊర్వశి థియేటర్ అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.