చిదంబరానివి దొంగ మాటలు: తెలంగాణపై నామా
తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు తీరని అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో యువకులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సంతాపం కూడా తెలుపని స్థితిలో లోకసభ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని పార్లమెంటు తెలంగాణ విద్యార్థులకు, యువకులకు విజ్ఞప్తి చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో కలిసి ఇందిరా గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు సోనియా గాంధీ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ అంశాన్ని పట్టించుకోకపోవడంపై ఆయన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై కూడా ధ్వజమెత్తారు. తెలంగాణ ఓట్లతో గెలిచి మంత్రి పదవి చేపట్టిన జైపాల్ రెడ్డి తెలంగాణపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ద్వంద్వ వైఖరి వల్లనే తెలంగాణ రావడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.