సీమాంధ్ర నేతలపై, టిడిపిపై కాంగ్రెసు టి - ఎంపిలు ఫైర్
తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు ఎప్పుడూ చెప్పలేదని గాదె వెంకటరెడ్డి చేసిన ప్రకటనను కూడా ఆయన తప్పు పట్టారు. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, రాష్ట్రంలో అఖిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని అదేశించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు చెప్పలేదని గాదె వెంకటరెడ్డి అనడం అవగాహనా రాహిత్యమైనా కావాలి, కాంగ్రెసులో ఉంటూ కూడా పరిణామాలను గుర్తించకుండానైనా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఏం జరుగుతోందో గాదె వెంకటరెడ్డి తెలుసుకంటున్నట్లు లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అనడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతిస్తామని చంద్రబాబుతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమను విమర్శించే హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నారు. తాము బాధ్యతగా వ్యవహరించినట్లు ప్రతిపక్ష నేత కూడా మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారని తాము ప్రధానిని అడిగామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, వి హనుమంతరావు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్చల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా తెలంగాణపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అడిగారు. తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేయలేదని, తెలంగాణపై తీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రిని కోరామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సాధన తమ లక్ష్యమని, పార్టీని కూడా కాపాడుకోవాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.