తెలంగాణ: బాబు దారిలో జగన్, దూరమౌతున్న నేతలు
అయితే తేల్చాల్సింది తాము కాదని, సెంటిమెంట్ ఉన్న కారణంగానే తాము పోటీ పెట్టడం లేదనే మాటలను తెలంగాణవాదులు నమ్మినట్లుగా కనిపించడం లేదు. అంతేకాదు వారు తెలంగాణపై ఆయా పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రశ్నిస్తున్నారు. టిడిపి, జగన్ పార్టీ ఏ పార్టీ అయిన తెలంగాణపై తమ వైఖరి ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆ పార్టీలను తెలంగాణ వ్యతిరేకులుగానే భావిస్తామని చెబుతున్నారు. జగన్ మాత్రం తెలంగాణపై దాదాపు చేతులెత్తేశారనే చెప్పవచ్చు. దీంతో తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై జగన్ ఏమీ తేల్చక పోవడం వల్లనే శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు.
తాను దివంగత వైయస్ కారణంగా ఎమ్మెల్సీ పొందానని, అదే గౌరవంతో జగన్ పార్టీలో చేరానని, అయితే రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పథకాల పట్ల ఆకర్షితురాలినై తాను కాంగ్రెసులో తిరిగి చేరుతున్నట్లు చెప్పారు. అయితే జగన్ తన వైఖరి తేల్చక పోవడం వల్లనే ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారని అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ కూడా రానున్న ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ససేమీరా అంటున్నారట. తెలంగాణపై తేల్చని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే తనకు నష్టమని భావించి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధమౌతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.