ఎన్ఎస్యుఐకి పూర్వవైభవం కాంగ్రెస్కుబలం: లగడపాటి
విద్యార్థులను ఆకర్షించేందుకు కృషి చేయాలని పార్లమెంటు సభ్యులు, పార్టీ నేతలకు లగడపాటి పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కనుగొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎన్ఎస్యుఐ అంతంత మాత్రంగానే ఉందన్నారు. త్వరలో బలోపేతం చేస్తామని చెప్పారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లగడపాటి సోమవారం సూచన చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో భూకేటాయింపులలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే ఆయన కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు.
జగన్తో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు, టిడిపితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని అధికార కాంగ్రెసు పార్టీకి ఎవరితోనూ కుమ్మక్కు అయ్యే పరిస్థితి లేదన్నారు. తన పేరును ఛార్జీషీటులో ఎ-1 నిందితుడిగా ఎందుకు పెట్టారని జగన్ ప్రశ్నిస్తున్నారని, జగన్ పేరును ఎ-1గా పెట్టి కూడా ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. టిడిపికి ఏమైనా అనుమానాలు ఉంటే హైకోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు.
వారు మమ్మల్ని అడిగితే మేం ఏం సమాధానం చెబుతామన్నారు. అది కోర్టు, సిబిఐ పరిధిలోని అంశమన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసినా చేయకపోయినా అందులో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వీరితో కుమ్మక్కయ్యారని వారు, వారితో కుమ్మక్కయ్యారని వీరంటున్నారని వీటిపై మేమేం సమాధానం చెప్పమన్నారు. లగడపాటి రాజగోపాల్ తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు.