బొత్స సత్తిబాబు ఎఫెక్ట్: ఎసిబి సిట్ చీఫ్ మార్పు
ఎసిబి విజయనగరం సిఐ గణేష్ విజయనగరం జిల్లా మద్యం సిండికేట్లపై రహస్యంగా దర్యాప్తు చేసి సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డికి పంపించారు. అయితే, దాంతో సంతృప్తి చెందకుండా శ్రీనివాస రెడ్డి తనను పిలిపించి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు నివేదికలో లేవని తప్పు పట్టడమే కాకుండా తనను దూషించారని గణేష్ లీగల్ నోటీసు ఇచ్చారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడానికి శ్రీనివాస రెడ్డి ద్వారా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. ఈ దుమారం చెలరేగుతున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి తనను మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇరికించాలని చూస్తున్నారని ఆయన అధిష్టానానికి చెప్పారు. దీంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
కిరణ్ కుమార్ రెడ్డిని, బొత్స సత్యనారాయణను, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిచింది. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి ముందు రాత్రికి రాత్రి శ్రీనివాస రెడ్డిని సిట్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించారు. బుధవారం రాత్రి శ్రీనివాస రెడ్డి బదిలీ కాగా, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బొత్స ఒత్తిడి కారణంగానే శ్రీనివాస రెడ్డిని సిట్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించారు.