తాత ఉరితీత అన్యాయం:సుప్రీంపై బిలావల్ ఎదురుదాడి
జుల్ఫికర్ అలిభుట్టో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సుప్రీం కోర్టునే లక్ష్యంగా చేసుకున్నారు. సింధు ప్రావిన్స్లోని నాదెరోలో బిలావల్ మాట్లాడుతూ దివంగత అధ్యక్షుడు జుల్ఫికర్ మరణశిక్ష విషయంలో తమ పార్టీ రివ్యూ పిటిషన్ను దాఖలు చేసిందని దీనిపై తమకు సరైన న్యాయం జరుగుతుందని బిలావల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జర్దారీపై కంటెంప్ట్ కేసు విషయంలో ద్వంద వైఖరేమీ లేదన్నారు. మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కూడా తీవ్రంగానే స్పదించారు. తనపై కేసులను తిరిగి తెరవాలంటూ సుప్రీం కోర్టు నుంచి వస్తున్న ఒత్తిడిని ప్రస్తావిస్తూ ఒక న్యాయమూర్తి తీర్పు కన్నా ప్రజా నిర్ణయమే అంతిమమని చరిత్ర రుజువు చేసిందన్నారు.
ఈ రోజు నేను కానీ, ప్రధాని తరపున లాయర్ కానీ కోర్టులో పోరాడుతున్నామంటే అది ప్రజా మద్దతుతోనే అంటూ చెప్పారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వంపై వస్తున్న ఎటువంటి ఆరోపణలైనా, విమర్శలకైనా తగిన సమాధానం ఇవ్వగల సామర్థ్యం తమకు ఉందని జర్దారీ స్పష్టం చేశారు.