వైయస్ అవినీతిని ప్రోత్సహించలేదు: వీరప్ప మొయిలీ
రాష్ట్ర కాంగ్రెసు నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలో సమసిపోతాయని ఆయన అన్నారు. కాంగ్రెసు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణపై పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికం కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వచ్చే సాధారణ ఎన్నికల ఫలితాలను ప్రతిఫలిస్తాయనేది కూడా నిజం కాదని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు రాహుల్ గాంధీని బాధ్యుడ్ని చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో విభేదాలు లేవని, ఉన్నా సర్దుకుంటాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ కాంగ్రెసు ప్రత్యామ్నాయం అవుతుందా, కాదా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. వీరప్ప మొయిలీని మంత్రులు దానం నాగేందర్, సారయ్య విమానాశ్రయంలో కలిశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వీరప్ప మొయిలీ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. వీరప్ప మొయిలీ వైయస్ రాజశేఖర రెడ్డి పక్షం తీసుకుని, ఆయనకు పూర్తిగా సహకరించారనే అభిప్రాయం రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకుల్లో ఉంది. వీరప్ప మొయిలీ వల్లనే వైయస్ ఏకపక్షంగా వ్యవహరించారని, వైయస్ జగన్ కొరకరాని కొయ్యగా తయారయ్యారని, పార్టీ పరిస్థితి దిగజారిందని పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పరిస్థితిని గందరగోళంగా తయారైన స్థితిలో ఆయన స్థానంలో గులాం నబీ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా వేశారు.