జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ సోదరుడు
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలలు అన్నింటిని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. వైయస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రాతినిథ్యం వహించిన రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపుకు టానికుల్లాగా పని చేయాలని సూచించారు. రానున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికలు 2014 సాధారణ ఎన్నికలకు నాంది అని అన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. బిఈడి విద్యార్థుల సమస్యలపై తాను పోరాడుతానని చెప్పారు.
కాగా అంతకుముందు జగన్ గంగవరం నుంచి తన పర్యటన ప్రారంభించారు. స్థానిక విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్ ఈరోజు పలు గ్రామాల్లో పర్యటించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పలుచోట్లు ఆవిష్కరిస్తారు. అనంతరం రాత్రి మాజీ మంత్రి, పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్ర బోసు ఇంట్లో బస చేస్తారు.