బొత్సను టార్గెట్ చేసిన బాబు, ఢిల్లీ స్థాయిలో ప్లాన్
బొత్స సత్యనారాయణను రక్షించడానికే రాత్రికి రాత్రి శ్రీనివాస రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన విమర్శించారు. కేసు దర్యాప్తులో ఉండగా, కోర్టులో నివేదిక సమర్పించాల్సిన తరుణంలో దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఐపియస్ అధికారిని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. బొత్సను రక్షించడానికే శ్రీనివాస రెడ్డిని బదిలీ చేశారని ఆయన అన్నారు.
మద్యం సిండికేట్ల విషయంలో విజయనగరం సిఐ గణేష్తో నాటకం ఆడించారని, మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, కేసులను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణను రక్షించడానికి ఢిల్లీ స్థాయిలో నాటకాలు ఆడారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ అవినీతిపరుల వైపే ఉందని ఆయన అన్నారు. లిక్కర్ మాఫియాపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
బొత్స సత్యనారాయణ మంత్రిగా కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. బొత్సకు భరోసా ఇచ్చి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన దుయ్యబట్టారు. మద్యం దుకాణాల విషయంలో బొత్స సత్యనారాయణ ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేశారని, తన కుటుంబ సభ్యులకు మద్యం దుకాణాలు ఉన్నాయని అంగీకరించారని ఆయన చెప్పారు. పని మనుషుల పేర్ల మీద కూడా బొత్స సత్యనారాయణ మద్యం దుకాణాలు నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎసిబి విచారణను కావాలని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. శ్రీనివాస రెడ్డి ఎవరో తనకు తెలియదని బొత్స అనడంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడితే, భయపెట్టే ధోరణిలో మాట్లాడితే మీడియా పక్కకు జరుగుతుందని బొత్స అనుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రమోషన్ ఇచ్చి శ్రీనివాస రెడ్డిని బదిలీ చేశామని అంటున్నారని, ప్రమోషన్ ఇచ్చినంత మాత్రాన బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బొత్స కోసమే శ్రీనివాస రెడ్డిని రాత్రికి రాత్రి బదిలే చేశారని ఆయన అన్నారు.
మాఫియాకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు. లిక్కర్ మాఫియా నివేదికలో 140 మంది పేర్లున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన తప్పు పట్టారు. గత ముఖ్యమంత్రి హయాంలో అధికారులను ప్రలోభ పెట్టి జైలుకు వెళ్లేలా చేశారని, ఇప్పటి ముఖ్యమంత్రి బదిలీ చేసి కేసులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లపై దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. వోక్స్ వ్యాగన్లో తన పేరు రాకుండా బొత్స సత్యనారాయణ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.