రాహుల్ గాంధీయే చెప్పారు: జగన్ పార్టీ నేత గోనె ప్రకాశ్
వైయస్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే చెప్పిన విషయాన్ని గోనె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ నుండి తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించి తప్పు చేశామని ఏఐసిసి నేతలే అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు.
వచ్చే ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో వైయస్ఆర్ను విమర్శిస్తే కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. వైయస్ వల్ల పదవులు పొందిన నేతలే ఇప్పుడు వాటిని కాపాడుకుంటూ ఆయననే విమర్శించే స్థాయికి దిగజారారన్నారు. ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఖాయమని గోనె జోస్యం చెప్పారు.
కాగా అంతకుముందు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే అర్హత, నైతిక విలువ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డికి గాని, కమలాపురం శాసనసభ్యుడు వీర శివా రెడ్డికి కానీ లేదని మండిపడ్డారు.